
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసు ఇప్పుడు భారత్ను అంతర్జాతీయ న్యాయస్థానానికి ఈడ్చింది. ఇందూ టెక్ జోన్ ఐటీ సెజ్ కేసుతో తాము భారీగా నష్టపోయామని, న్యాయం చేయాలని కోరుతూ మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్లోని ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది. ప్రధాని మోదీ సహా పలువురు మంత్రులకు నోటీసులు పంపించింది. ఇందూ టెక్ జోన్ ఐటీ సెజ్ కేసులో జగన్, శ్యామ్ప్రసాద్రెడ్డి సహా పలువురిపై సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇందూ టెక్ జోన్లో మారిషస్కు 49 శాతం వాటా ఉంది. ఐటీ సెజ్ కోసం మారిషస్కు చెందిన కరీసా ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం రూ.115 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఓ సారి రూ.1.18కోట్లు, రెండో సారి రూ.14కోట్లు, మూడో సారి రూ.99కోట్ల పెట్టుబడులు పెట్టింది.
అయితే సీబీఐ కేసుతో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. దీంతో తమకు భారీగా నష్టం వాటిల్లిందని 50 మిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇప్పించాలని మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మోదీకి నోటీసులు పంపడమే కాకుండా కేంద్ర ఆర్థిక, వాణిజ్య, న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను ప్రతివాదులుగా చేర్చింది. మారిషస్ నోటీసులు పంపిన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ధృవీకరించింది. సీబీఐ, ఈడీ కేసులు పెండింగ్లో ఉన్నందున తమ పెట్టుబడుల ఒప్పందానికి రక్షణ లేకుండా పోయిందంటూ మారిషస్ ప్రభుత్వం నోటీసులు పంపించినట్టు తెలంగాణ ప్రభుత్వ అధికారులు వివరించారు.