
చాలా కాలం తర్వాత హీరో అక్కినేని నాగార్జున హిందీ చిత్రంలో నటిస్తున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, రణ్బీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్రా’. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
చాల రోజుల నుంచి నాగార్జున హిందీ చిత్రం లో నటించాలనుకుంటున్నారని, ‘బ్రహ్మాస్త్రా’ కథ నచ్చడంతో ఇందులో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈరోజు నుంచి ముంబయిలో జరగబోయే చిత్రీకరణలో అమితాబ్తో పాటు ఆయన కూడా పాల్గొంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘బాహుబలి’ తరహాలో ఈ సినిమా ఉండబోతున్నట్లు రణ్బీర్ వెల్లడించారు.
హీరో అక్కినేని నాగార్జున ఇంతకుముందే అమితాబ్ తో ‘ఖుదా గవా’, ‘జఖమ్’, ‘అగ్ని వర్ష’, ‘ఎల్వోసీ కార్గిల్’ చిత్రాల్లో నటించారు. నాగార్జున తన కుటుంబంతో కలిసి నటించిన ‘మనం’ చిత్రంలో అమితాబ్ అతిథి పాత్రలో అలరించారు. చాలాకాలం తరువాత నాగ్, అమితాబ్ లు మరోసారి వెండితెరపై కనిపించబోతున్నారు.