
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. పంచాయతీల కాల పరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించేలా ప్రభుత్వం ఇటీవల జీవో 90ని తీసుకొచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రత్యేక అధికారుల పాలన వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.