
మీ పలుకుబడితో పార్టీలను ఏకం చేయండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత మీదే చంద్రబాబుతో అఖిలేశ్
ఈ రోజు దిల్లీకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు
తెదేపా అధినేత, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఫోన్ చేశారు. కాంగ్రెస్ సహా అన్ని విపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని చంద్రబాబుతో అఖిలేశ్ చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత మనపై ఉందన్నారు. భాజపాయేతర భావజాలం ఉన్న పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలని, జాతీయస్థాయిలో ఉన్న పలుకుబడితో పార్టీలను ఏకం చేయాలని చంద్రబాబును అఖిలేశ్ కోరారు. నిరంకుశ పోకడల నుంచి దేశాన్ని కాపాడాలన్నారు.
లౌకికవాదం ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు. తెదేపా ప్రయత్నాలకు సమాజ్వాదీ నుంచి సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం నాలుగేళ్లలోనే ఏపీ గొప్ప అభివృద్ధి సాధించిందని కొనియాడారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందన్నారు. నిరర్ధక ఆస్తులు నాలుగున్నరేళ్లలో ఆరేడు రెట్లు పెంచేశారని ఆరోపించారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ముస్లింలలో అభద్రతా భావం పెరిగిందని అఖిలేశ్తో చంద్రబాబు చెప్పారు.
తెలుగుదేశం ప్రయత్నాలకు సహకరించాలని ఈ సందర్భంగా అఖిలేశ్ను కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.
మరోవైపు నవంబర్ ఒకటో తేదీన సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. భాజపాయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే అజెండాగా సీఎం దిల్లీ పర్యటన కొనసాగనుంది.